మేడారం (సమ్మక్కజాతర)

 మేడారం, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలోని గ్రామం.

ఇది మండల కేంద్రమైన తాడ్వాయి నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వరంగల్ నుండి 104 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన జయశంకర్ జిల్లా లోకి చేర్చారు. ఆ తరువాత 2019 లో, కొత్తగా ములుగు జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 277 ఇళ్లతో, 1642 జనాభాతో 62 హెక్టార్లలో విస్తరించి ఉంది. 




సమ్మక్క సారక్క జాతర

    ప్రధాన వ్యాసం సమ్మక్క సారక్క జాతర

ఈ జాతర భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. 2008 ఫిబ్రవరిలో జరిగిన జాతరకు సుమారు 90 లక్షల మంది వచ్చారని అంచనా.ఇది విగ్రహాలు లేని జాతర.సమ్మక-సారలమ్మ జాతర గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు జరుగుతుంది .హన్మకొండ బస్టాండ్‌ నుంచి మేడారం వరకు పెద్దలకు రూ.90, పిల్లలకు రూ.45 లు బస్ చార్జి ఉంటుంది.కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుడిపై పోరు సలిపి వీరమరణం పొందిన గిరిజన వీరవనితలైన సమ్మక్క-సారలమ్మలను స్మరించుకుంటూ ఈ జాతర జరుగుతుంది. కుంభ మేళ తర్వాత భారీగా భక్తజనం పాల్గొనే ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రాష్ట్రం నుంచే కాకుండా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, మహారాష్ట్ర, ఒడిషా తదితర పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులతో మేడారం ప్రాంతం జనసంద్రాన్ని తల పిస్తుంది. భక్తి పారవశ్యంతో, పూనకాలతో ఊగిపోతూ లక్షలా ది భక్తులు సమ్మక్క-సారలమ్మ మొక్కులు చెల్లించుకుంటారు.కోయ గిరిజనుల ఉనికికోసం పోరు సల్పిన సమ్మక్క-సారలమ్మ జాతర కీ. శ.1260 నుంచి 1320 వరకు ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలం నుంచి కొనసాగు తున్నట్లు స్థల పురాణాలు తెలుపు తున్నాయి. ఆ కాలంలో మేడారం ప్రాంతాన్ని పడిగిద్దరాజు పరిపాలించే వారు. ఇతను కాకతీయుల సామంతరాజు. అప్పటి కరీంనగరాన్ని పాలించిన మేడరాజుకు మేనల్లుడైన పడిగిద్ద రాజు సతీమణి సమ్మక్క. ఆమెకు పగిడిద్దరాజుతో వివాహం జరిపించారు. పగిడిద్దరాజు, సమ్మక్క దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం. మేడారం పరిగణాలను కోయరాజులు కాకతీయులకు సామంతులుగా ఉండి పరిపాలించేవారు.ఓసారి మూడు, నాలుగేళ్ళ పాటు మేడారం ప్రాంతంలో అనావృష్టి ఏర్పడింది.దీంతో ప్రజలు పన్నులు కట్టలేని దయనీయ స్థితికి చేరుకున్నారు. పగిడిద్దరాజు తాను కప్పం కట్టలేనంటూ చేతులేత్తేశాడు. దీంతో ప్రతాపరుద్రుడు వారిపైకి సైనికులను పంపాడు. కాకతీయ సైన్యం వంటి ములుగు జిల్లాలోని ములుగు సమీపంలో లక్నవరం సరస్సు వద్ద స్థావరం ఏర్పాటు చేసుకొని యుద్ధం ప్రకటించారు. పడిగిద్దరాజు అతని కుమార్తెలు, నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు కలిసి కాకతీయ సైన్యాన్ని మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద నిలువరించి పోరాడి వీరమరణం పొందారు. కుమారుడు జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాటి నుంచి సంపెంగ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి గాంచింది. తన కొడుకు, కుమార్తె మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది.ఈటెలు, బళ్ళాలతో కాకతీయసైన్యాలను పరుగెత్తించి అంతం చేసింది. ఇక ఓటమి తప్పదని భావించిన ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెనుక నుంచి పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి గుట్ట మలుపు తిరిగిన తర్వాత ఆమె అదృశ్యమైంది.తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారాడు. మేడారం జాతర గద్దెల ప్రాంగణానికి సాంప్రదాయ పద్ధతిలో దేవతలను తీసుకు వస్తారు. వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే ఇక్కడ పూజారులుగా కొనసాగుతున్నారు. మేడారం జాతరకు సుమారు పది రోజుల ముందు నుంచే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సారలమ్మ పూజారులు కన్నెపల్లిలోని గుడి వద్ద అమ్మ వారిని పూజించి సమ్మక్క దేవతాపూజారులైన సిద్దబోయిన వారింటికి వస్తారు. సమ్మక్క పూజారులు చిలుకలగుట్ట వద్దకు వెళ్ళి దేవతను కుంకుమ భరిణ రూపంలో తీసుకు వస్తారు.[5] ఈ సందర్భంగా జిల్లా అధికారులు 10 రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపి దేవతను గద్దెకు తీసుకు వస్తారు.భక్తుల మొక్కుబడుల అనంతరం తిరిగి దేవతలు వనప్రవేశం చేస్తారు.

No comments:

Post a Comment