అమరావతి.. అమరలింగేశ్వర స్వామి



అమరావతి.. అమరలింగేశ్వర స్వామి: గుంటూరు జిల్లా


అమరలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రధాన గోపురము
ఇది శైవ క్షేత్రము. గుంటూరు జిల్లాలొ వున్న అమరావతి పట్టణంలో కృష్ణానది తీరాన వున్నది ఈ ఆలయము. ఈ ఆలయంలో కొలువు దీరిన దేవుడు అమరలింగేశ్వర స్వామి. ఈ శివాలయము ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాలలో ఇది ఒకటి. శ్రీకృష్ణదేవరాయలు అమరావతిని సందర్శించి ఇక్కడి అమరేశ్వరునికి నైవేద్య మహాపూజలు నిర్వహించినట్టు, పెదమద్దూరు గ్రామ పంటభూముల్ని ఆలయానికి దానమిచ్చినట్టుగా ఇక్కడ ఉన్న రాజశాసనం తేటతెల్లం చేస్తోంది. కొండవీటి రెడ్డిరాజులపై విజయానంతరం 1517లో చారిత్రక ప్రాంతం కృష్ణాతీరమైన అమరావతిని దర్శించిన కృష్ణదేవరాయలు ఇక్కడ తులాభారం తూగారు. తన బరువుతో సరిసమానమైన బంగారాన్ని పేదలకు పంచిపెట్టినట్టుగా శాసనంలో ఉంది. అందుకు గుర్తుగా రాయలు నిర్మించిన తులాభార మండపం, దానిముందు వేయించిన శాసనం నేటికీ ఇక్కడ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆలయంలోని దక్షిణ రెండో ప్రాకారంలో ఈ మండపం ఉంది. నేడు అమరావతి అమరేశ్వరునిగా కొలువందు కుంటున్న స్వామి నాడు ధరణికోట అమరేశ్వరస్వామిగా వెలుగొందాడని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. రాయలు తన భార్య చిన్నాదేవి చేత కృష్ణవేణీ తీరాన రత్నధేను మహాదానం, తిరుమల దేవి చేత సప్తసాగర మహాదానం చేయించి నట్టుగా ఇందులో రాసి ఉంది.
  • స్థానికంగా వున్న ఇతర విసేషాలు.

అమరావతిలో భౌద్ద సూపం. నమూనా చిత్రం
అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధాని యైన ధాన్యకటకం. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. బౌద్ధమత చరిత్రలో ధాన్యకటకానిది ప్రముఖ స్థానం. ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకు రాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్ర దుర్గాలలో ఈ నగరమొకటి. సుమారు 16 కి.మీ చుట్టుకొలత కలిగిన మహానగరం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4 - 3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపదం)గా ఉన్నట్టు అధారాలున్నాయి. బుద్ధుని జీవితకాలము నుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగున పడిన చైత్య ప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. దీపాలదిన్నె గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ. అప్పటికే మహాచైత్యం అంతా కూలిపోయి 90 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తుగల ఒక దిబ్బలాగా మిగిలింది. అనేక విడతలుగా జరిగిన తవ్వకాలలో ఎన్నో విలువైన విగ్రహాలు, పరికరాలు మరియు ఇతర వస్తువులు దొరికాయి. ఈ త్రవ్వకాలను సర్ వాల్టర్ స్మిత్ 1845 లో, రాబర్ట్ సీవెల్ 1877 లో, జేమ్స్ బర్గెస్ 1881 లో మరియు అలక్జాండర్ రియ 1888-89 మధ్యలో చేపట్టారు. ఆఖరున జరిగిన తవ్వకాలలో ఈ చైత్య నిర్మాణానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నివసించిన మెగాలిథ్స్ కి సంబంధించిన అవశేషాలు కూడా దొరికాయి. ఇక్కడ దొరికిన శిల్పాలలో ఎక్కువ మద్రాస్ గవర్నమెంట్ మ్యూజియం, చెన్నై మరియు బ్రిటిష్ మ్యూజియం, లండన్ లలో భద్రపరిచారు. ధాన్యకటకంలో 1962-65 మధ్యలో యమ్. వెంకటరామయ్య మరియు కె.రాఘవాచారి ల అధ్వర్యంలో త్రవ్వకాలు జరిగాయి. ఇందులో ఐదు కాలాలకు కి సంబంధించిన అధారాలు దొరికాయి. కార్బన్ డేటింగ్ ద్వారా ఈ పట్టణం క్రీ.పూ.5వ శతాబ్ధికి చెందిందని తెలిసింది.
అద్భుతమైన శిల్పకళతో అలరారే స్థూపంపై బుద్దుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. స్థూపంపై బ్రాహ్మీ లిపిలో శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్థూపం గురించి అప్పటి బ్రిటిషు పురాతత్వ పరిశోధకుడు ఫెర్గుసన్ ఇలా అన్నాడు: "కళావైదుష్యానికి సంబంధించి ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన కట్టడము". దీన్ని చెన్నై లోని ప్రభుత్వ ప్రదర్శనశాలలో భద్రపరచారు.
అఅమరావతికి అతి దగ్గర రైల్వే స్టేషన్ గుంటూరు. అక్కడ నుండి అమరావతికి బస్సు సర్వీసు ఉంది. వర్షాకాలంలో విజయవాడ నుండి లాంచిల ద్వారా కృష్ణానది పై ప్రయాణించి అమరావతి చేరవచ్చు. స్థూపం ఉండిన ప్రదేశం, భారతీయ పురాతత్వ సర్వేక్షణ వారి సంగ్రహాలయము మరియు అమరేశ్వర మందిరం ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.

No comments:

Post a Comment